కడుపులో పెరుగుతున్న శిశువుకు 'ప్లాసెంటా' అంటే మాయ ఒక జీవనాడి లాంటిది. తల్లి నుంచి బిడ్డకు ఆక్సిజన్, పోషకాలను అందించడం, వ్యర్థాలను బయటకు పంపడం, అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం, శిశువుకు రక్షణ కల్పించడం వంటి కీలక పనులన్నీ ప్లాసెంటానే చేస్తుంది. అయితే, గర్భధారణ సమయంలో నేరుగా ప్లాసెంటా పనితీరును అధ్యయనం చేయడం చాలా కష్టం. అందుకే దీనిపై శాస్త్రవేత్తలకున్న అవగాహన ఇప్పటికీ పరిమితమే.
కానీ, తాజాగా భారతీయ శాస్త్రవేత్తలు ఈ దిశగా ఒక అద్భుతమైన విజయం సాధించారు. గర్భధారణ సమస్యలను, మందుల ప్రభావాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రపంచంలోనే అత్యంత చౌకైన 'ప్లాసెంటా-ఆన్-చిప్' (Placenta-on-chip) సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సరికొత్త ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
ఏమిటీ ప్లాసెంటా-ఆన్-చిప్..?
ముంబైలోని ఐసీఎంఆర్ (ICMR) - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ విమెన్స్ హెల్త్, అలాగే ఐఐటీ బాంబే (IIT Bombay) శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది ప్రయోగశాలలో అచ్చం మనిషి ప్లాసెంటా లాగానే పనిచేస్తుంది.
హార్మోన్ల ఉత్పత్తి, తల్లి నుంచి పిండానికి గ్లూకోజ్ చేరవేయడం, యూరియా లాంటి వ్యర్థాల తొలగింపు తదితర కీలక జీవక్రియలన్నింటినీ ఈ చిప్ ద్వారా ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించి అధ్యయనం చేయవచ్చు.
ఈ ప్రతిష్టాత్మక పరిశోధన 'బయోఫ్యాబ్రికేషన్ జర్నల్' (Biofabrication Journal) లో ప్రచురితమైంది.
దీనివల్ల ఉపయోగాలు ఏంటి..?
ఈ నూతన ఆవిష్కరణ వైద్యరంగంలో, ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్య పరిరక్షణలో కీలక మార్పులు తీసుకురానుందని నిపుణులు భావిస్తున్నారు. గర్భకాలంలో వచ్చే మధుమేహం (Gestational Diabetes), ప్రీ-ఎక్లాంప్సియా (Pre-eclampsia), పిండం ఎదుగుదల ఆగిపోవడం వంటి సంక్లిష్ట సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
తల్లి వాడే మందులు ప్లాసెంటా ద్వారా శిశువుకు ఎలా చేరుతున్నాయి..? వాటి ప్రభావం ఎలా ఉందనేది సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల గర్భిణులకు సురక్షితమైన చికిత్సలు అందించడం సాధ్యమవుతుంది.
జంతువులపై ప్రయోగాలకు చెక్..
ఈ చిప్ అందుబాటులోకి రావడంతో గర్భధారణ పరిశోధనల కోసం జంతువులపై ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది.
మన టెక్నాలజీకే ఎందుకు అంత ప్రత్యేకత..?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని 'ప్లాసెంటా-ఆన్-చిప్' వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి చాలా సంక్లిష్టమైనవి,అత్యంత ఖరీదైనవి. కానీ, మన భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ప్లాట్ఫామ్ చాలా సరళమైనది, చౌకైనది. అంతేకాదు, సాధారణ ప్రయోగశాలల్లో కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు.
పుట్టే ప్రతి మనిషికీ ప్లాసెంటా ఆధారం అయినప్పటికీ, దాని గురించి మనకు తెలిసింది చాలా తక్కువే అని, ఈ తాజా ఆవిష్కరణతో ఆ లోటు తీరుతుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ దీపక్ మోదీ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భారత్లో మాతృ శిశు సంరక్షణ పరిశోధనలకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడనుంది.

