మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా భారతీయుల్లో ఉదర, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత, చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ సమస్య ఆందోళనకర స్థాయికి చేరుకుందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించిన కీలక అంశాలు..
ఆందోళన రేకెత్తిస్తున్న గణాంకాలు..
దేశంలో 38.6 శాతం మంది యువకులు ఫ్యాటీ లివర్ బారిన పడ్డారు. అంటే సగటున ప్రతి 10 మందిలో నలుగురు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
చిన్నపిల్లల్లో కూడా ఈ ముప్పు 35.4 శాతంగా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రారంభ దశలో దీని లక్షణాలు బయటపడవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మధుమేహుల్లో లివర్ ఫైబ్రోసిస్ ముప్పు..
ఫ్యాటీ లివర్ సమస్యకు ప్రధానంగా మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటుతో దగ్గరి సంబంధం ఉంది.
టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న ప్రతి నలుగురు రోగుల్లో ఒకరికి తీవ్రమైన 'లివర్ ఫైబ్రోసిస్' ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఫ్యాటీ లివర్ పరీక్షలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
యువతలో పెరుగుతున్న పేగు క్యాన్సర్..
యువతలో కొలొరెక్టల్ (పేగు) క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 2022 గణాంకాల ప్రకారం భారత్లో కొత్తగా 40,430 మంది పురుషులు, 24,433 మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడ్డారు.
అప్రమత్తం చేసే లక్షణాలు..
మలంలో రక్తం పడటం, విసర్జన అలవాట్లలో నిరంతర మార్పులు, కారణం లేకుండా బరువు తగ్గడం వంటివి కనిపిస్తే సాధారణ ఉదర సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఎండోస్కోపీ తదితర పరీక్షలు చేయించుకోవాలి.
చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు, పోషకాహార లోపం..
హెలికోబాక్టర్ పైలోరీ (H. pylori) బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇది కడుపులో అల్సర్లు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్లకు దారితీస్తోంది.
కడుపులో నులిపురుగుల కారణంగా చిన్నారులు తీవ్ర రక్తహీనత, పోషకాహార లోపం బారిన పడుతున్నారు.
ఎయిమ్స్ నివేదిక ప్రకారం ప్రతి 96 మందిలో ఒకరు 'సీలియాక్' వ్యాధితో బాధపడుతున్నారు. ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD) కేసులు కూడా పెరుగుతున్నాయి.
భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ సదస్సు..
పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులపై మేథోమథనం చేసేందుకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు 'వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట రాలజీ-2026' సదస్సు ఢిల్లీలోని ద్వారకలో జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఇందులో పాల్గొని జీర్ణకోశ సమస్యల నిర్ధారణ, ఎండోస్కోపీ, గట్ మైక్రోబయోమ్, అత్యాధునిక చికిత్సా విధానాలపై చర్చించనున్నారు.

