మీ స్మార్ట్ఫోన్లో వందల కొద్దీ కాంటాక్ట్స్ ఉన్నాయా? సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్లు ఉన్నారా? మీరు ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయా? అయినా.. నిజ జీవితంలో మీరెప్పుడైనా లోపల ఎక్కడో తెలియని శూన్యతను, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పట్టి పీడిస్తున్న 'నిశ్శబ్ద మహమ్మారి'.
కరోనా విపత్తు తర్వాత ప్రపంచాన్ని అత్యంత భయపెడుతున్న మరో తీవ్రమైన సమస్య 'ఒంటరిదనం' (Loneliness). ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందంటే.. రోజుకు 15 సిగరెట్లు తాగితే మనిషికి ఎంత ప్రమాదమో, ఒంటరిదనం వల్ల కూడా అంతే స్థాయిలో ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ప్రతి ఆరుగురిలో ఒకరు బలి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ తీవ్రమైన ఏకాంతాన్ని అనుభవిస్తున్నారు. కేవలం వృద్ధులు, పెద్దలు మాత్రమే కాకుండా చిన్నారులు కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. బాల్యంలో ఒంటరిగా పెరిగిన పిల్లలకు, భవిష్యత్తులో 'డిమెన్షియా' వంటి తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గుంపులో గోవింద.. అయినా ఒంటరిగానే!
గతంలో ఒంటరిదనం అంటే మన చుట్టూ ఎవరూ లేకపోవడం. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఆఫీసులో పదుల సంఖ్యలో సహోద్యోగుల మధ్య ఉన్నా, పండుగల్లో బంధువుల మధ్య ఉన్నా మనిషి ఒంటరితనాన్నే ఫీలవుతున్నాడు. ఫోన్ స్క్రీన్ మీద ఎన్నో ముఖాలు కనిపిస్తున్నా.. మనసులోని బాధను, సంతోషాన్ని పంచుకునే నిజమైన ఆత్మీయులు కరువయ్యారు. ఇలా దీర్ఘకాలం పాటు సామాజిక సంబంధాలకు దూరంగా ఉండటం వల్ల తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్ తలెత్తుతున్నాయి.
సోషల్ మీడియాయే అసలు విలన్..
ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచం అరచేతిలోకి వచ్చేసినా.. పక్కనున్న మనుషుల మధ్య దూరం మాత్రం పెరిగిపోతోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ రచయిత పాల్ డైలీ విశ్లేషణ ప్రకారం.. "మనుషుల మెదళ్లను హైజాక్ చేసి, వారిని మానసికంగా దివాలా తీయించడం ద్వారా టెక్ కంపెనీలు కోట్లు గడిస్తున్నాయి". ఆన్లైన్లో ఉండటం తప్పనిసరి అయిన ప్రస్తుత వాతావరణంలో 25 ఏళ్ల లోపు యువత ఈ ఒంటరితనానికి ఎక్కువగా బలవుతున్నారు.
వ్యసనంగా మారుతున్న 'ఫోమో'..
'అందరూ ఏమేం చేస్తున్నారో.. నేనెక్కడ వెనుకబడిపోతానో' అనే భయం దీనినే సైకాలజీలో FOMO - Fear Of Missing Out అంటారు. ఈ భయంతోనే దాదాపు 70 శాతానికి పైగా యువత అర్ధరాత్రి దాటే వరకూ సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు. ఫోన్లో వచ్చే ప్రతి నోటిఫికేషన్కు, లైక్కు మెదడులో 'డోపమైన్' అనే హార్మోన్ విడుదలవుతుంది. న్యూరోసైన్స్ ప్రకారం.. ఇది జూదం, డ్రగ్స్ లాంటి వ్యసనాలతో సమానం. సోషల్ మీడియా తమను నాశనం చేస్తుందని తెలిసినా యువత అందులోంచి బయటకు రాలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం.
పరిష్కారం ఏమిటి..?
డిజిటల్ ప్రపంచం నుంచి కాస్త బయటకు వచ్చి, నిజమైన మనుషులతో గడపడమే దీనికి అసలైన మందు. వర్చువల్ లైకుల కంటే.. ఆత్మీయుల పలకరింపు మనసుకు ఎక్కువ సాంత్వన ఇస్తుంది. కాబట్టి రోజులో కొంత సమయం ఫోన్ను పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడపాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

