ఇప్పటికే మధ్యప్రాచ్య యుద్ధ మేఘాల మధ్య ఆర్థికంగా సతమతమవుతున్న ఆసియా ఖండానికి ఇప్పుడు ప్రకృతి రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. రానున్న మే నుంచి జూలై మధ్య కాలంలో అత్యంత శక్తిమంతమైన 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడవచ్చని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం హెచ్చరించింది. దీనివల్ల ఆసియా దేశాల్లో తీవ్రమైన వేడిగాలులు, కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.
ఏమిటీ 'ఎల్ నినో'..?
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే వాతావరణ ప్రక్రియనే 'ఎల్ నినో' అంటారు. ఇది ప్రతి రెండు నుంచి ఏడేళ్లకోసారి సంభవిస్తుంది. దీని ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో గాలి పీడనం, వర్షపాతంలో భారీ మార్పులు వస్తాయి. దీనివల్ల ఇండోనేషియా వంటి దేశాల్లో సాధారణంగా కురిసే వర్షాలు సముద్రం వైపు మళ్లుతాయి. ఫలితంగా ఆయా దేశాల్లో కరువు కాటకాలు, అడవుల్లో కార్చిచ్చు సంభవిస్తాయి.
శక్తిమంతమైన 'సూపర్ ఎల్ నినో'..
ప్రస్తుతం కనిపిస్తున్న సూచనల ప్రకారం.. ఇది 1997,98 నాటి అత్యంత భయంకరమైన ఎల్ నినో పరిస్థితులను పోలి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో దీనివల్ల ఇండోనేషియాలో కోట్లాది హెక్టార్ల అడవులు తగలబడి, ప్రాంతీయంగా తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడింది. ఈసారి కూడా వర్షపాతం గత 30 ఏళ్లలో లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం..
ఎండలు ముదరడంతో ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీల వాడకం పెరిగి విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుంది. మరోవైపు, వర్షాలు లేక జలాశయాలు ఎండిపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. గతంలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో హీట్వేవ్ వల్ల జల విద్యుత్ ఉత్పత్తి 50శాతంపైగా పడిపోయిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
యుద్ధం కారణంగా ఇప్పటికే ఎరువులు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ఎల్ నినో వల్ల కరువు ఏర్పడితే పంట దిగుబడి తగ్గి, ఆహార పదార్థాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఆసియా దేశాల్లో ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. ఇరాన్ తన వ్యూహాత్మక జలసంధిని మూసివేయడంతో చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. వేడి పెరిగి ఇంధన కొరత ఏర్పడితే ఆర్థిక వ్యవస్థలు కుంటుపడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిష్కార మార్గాలు ఏవి..?
వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవాలంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. సోలార్, విండ్ పవర్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవడం ద్వారా విద్యుత్ గ్రిడ్లను మరింత పటిష్టం చేసుకోవాలని వారు కోరుతున్నారు. తీవ్రమైన వేడి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు, పండ్ల రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం వేళలో వీలైనంత వరకు బయట తిరగకుండా జాగ్రత్త పడాలి. తేలికపాటి నూలు వస్త్రాలను ధరించాలి.

