పంజాబ్, హరియాణా, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో క్యాన్సర్ కేసుల సంఖ్య గత ఐదేళ్లలో దాదాపు 10 శాతం పెరిగినట్లు ఐసీఎంఆర్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అంచనాలు వెల్లడించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 2021లో 78,514గా ఉన్న అంచనా క్యాన్సర్ కేసులు 2025 నాటికి 86,352కు చేరాయి.
ఈ కాలంలో హరియాణాలో అత్యధికంగా 11.26 శాతం పెరుగుదల నమోదైంది. అక్కడ 2021లో 30,015 కేసులు ఉండగా.. 2025 నాటికి 33,395కు చేరాయి. పంజాబ్లో 9.29 శాతం పెరిగి 39,521 నుంచి 43,196 కేసులకు చేరాయి. ఇక హిమాచల్ప్రదేశ్లో 8.72 శాతం పెరుగుదలతో 8,978 నుంచి 9,761 కేసులకు చేరుకున్నాయి.
దేశవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసుల సంఖ్య 2021లో 14,26,447 నుంచి 2025లో 15,69,793కు పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి.
క్యాన్సర్ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లు పైబడిన వారికి నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడంతో పాటు, తక్కువ ధరలకు క్యాన్సర్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక క్యాన్సర్ చికిత్స కేంద్రాల ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
గమనిక: ఈ వార్తలోని క్యాన్సర్ కేసుల గణాంకాలు ఐసీఎంఆర్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అంచనాల ఆధారంగా ఉన్నాయి. క్యాన్సర్ నివారణకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, వయసుకు అనుగుణమైన స్క్రీనింగ్లు చేయించుకోవడం, అనుమానాస్పద లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

