తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. Employees Health Scheme (EHS) కింద కొత్త QR కోడ్ ఆధారిత డిజిటల్ హెల్త్ కార్డులను ఈ నెల జులై 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఇప్పటి వరకు ఉన్న ప్లాస్టిక్ కార్డుల స్థానంలో ఈ కొత్త డిజిటల్ కార్డులను నేరుగా మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు.
943 ఆస్పత్రుల్లో క్యాష్లెస్ చికిత్స
ఈ కొత్త EHS పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎంప్యానెల్ చేసిన 943 ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే 2,594 రకాల వ్యాధుల చికిత్సలు, శస్త్రచికిత్సలు ఈ పథకంలో కవర్ కానున్నాయి.
ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్లు
ఉద్యోగులు, పెన్షనర్లకు ఓపీ సేవలు, రక్త పరీక్షలు, రెగ్యులర్ మందులు అందించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్లను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఉన్న 12 కేంద్రాలకు అదనంగా మరో 24 కొత్త వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రీమియంపై కీలక మార్పు
భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లైతే, ఇకపై ఇద్దరి జీతాలు లేదా పెన్షన్ల నుంచి కాకుండా ఒకరి జీతం లేదా పెన్షన్ నుంచి మాత్రమే నెలవారీ ప్రీమియం మినహాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో వేలాది ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించనుంది.

