న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి మరింత గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ (NITI Aayog) కీలక రోడ్మ్యాప్ను విడుదల చేసింది. ప్రస్తుతం వెల్నెస్ (Wellness) విధానంగా మాత్రమే గుర్తింపు పొందుతున్న ఆయుర్వేదాన్ని, భవిష్యత్తులో పూర్తి స్థాయి వైద్య విధానంగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందేలా చర్యలు చేపట్టాలని ఇందులో సూచించింది.
'స్ట్రాటజిక్ రోడ్మ్యాప్ ఫర్ మేకింగ్ ఆయుర్వేద గ్లోబల్' పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో 2047 నాటికి ఆయుర్వేదాన్ని ప్రపంచ ఆరోగ్య రంగంలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి మరింత గుర్తింపు
ప్రస్తుతం భారతదేశం నుంచి ఆయుష్, ఔషధ మూలికల ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 150 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2014లో సుమారు 1.09 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్న ఎగుమతులు, 2023 నాటికి 2.16 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
అయితే అనేక దేశాల్లో నియంత్రణ నిబంధనలు కఠినంగా ఉండటంతో, చాలా ఆయుర్వేద ఉత్పత్తులు ఇప్పటికీ సాధారణ హెల్త్ సప్లిమెంట్స్గానే విక్రయించబడుతున్నాయని పేర్కొంది.
ప్రపంచ స్థాయి రిజిస్టర్కు ప్రతిపాదన
ప్రస్తుతం భారత్లో 3.55 లక్షలకుపైగా ఆయుర్వేద వైద్యులు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ గుర్తింపు కలిగిన లైసెన్సింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల చాలా మంది విదేశాల్లో సేవలు అందించే అవకాశం పొందడం లేదని నివేదిక తెలిపింది.
దీనిని దృష్టిలో పెట్టుకుని గ్లోబల్ ఆయుర్వేద రిజిస్టర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీని ద్వారా వైద్యుల అర్హతలను అంతర్జాతీయ స్థాయిలో ధృవీకరించే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ దేశాల్లో లైసెన్స్, వీసా నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.
పరిశోధనలకు మరింత ప్రాధాన్యం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో మరిన్ని క్లినికల్ అధ్యయనాలు నిర్వహించడం, ఆయుర్వేద మందుల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచడం, భద్రతపై ప్రతి ఏడాది నివేదికలు విడుదల చేయడం వంటి అంశాలను కూడా రోడ్మ్యాప్లో ప్రతిపాదించారు.
ఔషధాలకే కాదు.. వైద్య సేవలకూ ప్రాధాన్యం
కేవలం ఔషధ మూలికలను ఎగుమతి చేయడం కాకుండా, ఆయుర్వేద ఔషధాలు, వైద్య సేవలు, నిపుణుల సేవలను కూడా ప్రపంచానికి అందించే దిశగా భారత్ ముందుకు సాగాలని నీతి ఆయోగ్ సూచించింది.
విదేశాల్లో ఆయుర్వేద కేంద్రాల ఏర్పాటు, ఆయుష్ ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహక మండలి ఏర్పాటు, వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని నివేదిక పేర్కొంది.
గమనిక: ఈ కథనం ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పించే ఉద్దేశంతో మాత్రమే ప్రచురించబడింది. ఇందులోని వివరాలు నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా అందించబడ్డాయి.

