వానాకాలం రాగానే వాతావరణం చల్లబడి.. వేడి వేడి పకోడీలు, రోడ్డు పక్కన దొరికే చాట్ తినాలనిపించడం సహజం. కానీ, బయట వాతావరణం ఆహ్లాదకరంగా మారినా.. మన జీర్ణవ్యవస్థ మాత్రం ఈ కాలంలో కాస్త సున్నితంగా మారుతుంది. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ల బెడద ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు ముప్పు పొంచి ఉంటుంది. మనకు తెలియకుండానే మనం ఇష్టపడే కొన్ని స్నాక్స్ మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ఈ సీజన్లో దూరంగా ఉండాల్సిన ఏడు ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం..
1. పచ్చి కూరగాయలు, సలాడ్లు (Raw Salads)..
సలాడ్లు ఆరోగ్యానికి మంచిదే అయినా.. వానాకాలంలో పచ్చి కూరగాయలు తినకపోవడమే సురక్షితం. గాలిలో పెరిగిన తేమ, నిలిచిపోయిన నీటి కారణంగా ఆకులపై బ్యాక్టీరియా, కీటకాలు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. వీటిని ఎంత కడిగినా ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు పూర్తిగా తొలగిపోదు. కాబట్టి సలాడ్లకు బదులుగా ఆవిరిపై ఉడికించిన లేదా వేయించిన కూరగాయలను ఎంచుకోవడం ఉత్తమం. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా పోషకాలు అందుతాయి.
2. సీ ఫుడ్ (Seafood)..
వర్షాకాలం చేపలు, ఇతర సముద్ర జీవుల సంతానోత్పత్తి సమయం. అంతేకాకుండా, భారీ వర్షాల వల్ల వరద నీరు సముద్రంలో కలవడం వల్ల నీటి కాలుష్యం తీవ్రంగా ఉంటుంది. ఈ కలుషిత నీటి ప్రభావం సముద్రపు ఆహారం (Seafood) పై వెంటనే పడుతుంది. ఈ సమయంలో సీ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి, కొన్ని వారాల పాటు రొయ్యలు, చేపలకు దూరంగా ఉండటం మేలు.
3. రోడ్డు పక్కన దొరికే పండ్ల రసాలు, కట్ చేసిన పండ్లు..
ముందుగా కోసి పెట్టిన పండ్లు, రోడ్డు పక్కన అమ్మే పండ్ల రసాలకు ఈ కాలంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చూడటానికి తాజాగా కనిపించినా.. గంటల తరబడి బయట ఉంచడం వల్ల వీటిపై ఈగలు వాలడం, దుమ్ము చేరడం జరుగుతుంది. దానికి తోడు, వారు వాడే కలుషిత నీరు, ఐస్ వల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటివి వస్తాయి. పండ్లను ఇంటికి తెచ్చుకుని, శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కోసుకుని తినాలి.
4. పాశ్చరైజ్ చేయని పాలు, పాల ఉత్పత్తులు..
తేమతో కూడిన వాతావరణంలో పాలు త్వరగా పాడైపోతాయి. పచ్చి పాలు లేదా పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులలో బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ కాలంలో స్వచ్ఛమైన పాల పేరుతో ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. ప్యాకెట్ పాలను కూడా బాగా మరిగించిన తర్వాతే వాడాలి. ఫ్రిజ్లో ఉంచిన ఉత్పత్తులను వాడే ముందు వాటి వాసన, ఆకృతిని ఒకసారి సరిచూసుకోవాలి.
5. పుట్టగొడుగులు (Mushrooms)..
మష్రూమ్స్ ప్రాథమికంగా స్పాంజిలా పనిచేసి, చుట్టుపక్కల ఉన్న నీటిని, మురికిని త్వరగా పీల్చుకుంటాయి. వానాకాలంలో వీటిలో ఫంగస్, కంటికి కనిపించని బూజు చేరే ప్రమాదం ఉంది. దుకాణాల్లో కొన్నవి కూడా తేమ వల్ల త్వరగా పాడైపోతాయి. కాబట్టి, వండే ముందు అవి తాజాగా ఉన్నాయో లేదో జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
6. ఆకుకూరలు (Leafy Greens)..
ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలు వర్షాకాలంలో కాస్త ఇబ్బంది పెడతాయి. ఇవి అధిక బురద, తేమ మధ్య పెరగడం వల్ల త్వరగా కలుషితం అవుతాయి. వీటిలో కంటికి కనిపించని పురుగులు, పరాన్నజీవులు గుడ్లు పెడతాయి. ఒకవేళ పాలకూర, మెంతికూర వంటివి వండుకోవాల్సి వస్తే.. గోరువెచ్చని ఉప్పు నీటిలో చాలాసార్లు శుభ్రంగా కడిగి, బాగా ఉడికించిన తర్వాతే తినాలి.
7. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్..
వాన పడుతున్నప్పుడు వేడి వేడి సమోసాలు, బజ్జీలు తినాలనే కోరిక బలంగా ఉంటుంది. కానీ ఈ కాలంలో మన జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. బరువైన నూనె పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉన్న ఈ సమయంలో.. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.
ఇంటి భోజనమే మేలు..
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో వేడిగా, తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం, కూరగాయలను శ్రద్ధగా కడగడం అలవాటు చేసుకోవాలి.

