క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న రోగులకు ఉపశమనం కలిగించేలా భారతీయ శాస్త్రవేత్తలు వైద్య పరిశోధనల్లో సరికొత్త మైలురాయిని అధిగమించారు. ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా, కేవలం క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే సరికొత్త ‘ఔషధ రవాణా వ్యవస్థ’ (టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ సిస్టమ్)ను పూణే పరిశోధకులు విజయవంతంగా ఆవిష్కరించారు. దీనివల్ల క్యాన్సర్ చికిత్సల్లో సాధారణంగా ఎదురయ్యే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక పరిశోధన వివరాలు అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘అడ్వాన్స్డ్ హెల్త్కేర్ మెటీరియల్స్’లో ప్రచురితమయ్యాయి.
నానో టెక్నాలజీతో ‘లక్షిత’ దాడి..
పూణేలోని ప్రసిద్ధ ‘అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (ARI) శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) చికిత్సను మరింత సులభతరం చేసేందుకు ఈ జన్యు చికిత్సా విధానాన్ని రూపొందించారు.
జీవ విచ్ఛిన్న నానో కణాలు..
ఈ విధానంలో శరీరంలో సులభంగా కరిగిపోయే ‘మెసోపోరస్ సిలికా నానోపార్టికల్స్’ అనే అతి సూక్ష్మ కణాలను శాస్త్రవేత్తలు వేదికగా చేసుకున్నారు. ఇవి పెద్ద మొత్తంలో ఔషధాన్ని లేదా చికిత్సా పదార్థాన్ని మోసుకెళ్లగలవు.
జన్యువుల నియంత్రణ: ఈ నానో కణాల ద్వారా ‘స్మాల్ ఇంటర్ఫెరింగ్ ఆర్ఎన్ఏ’ (siRNA) అనే అణువులను నేరుగా క్యాన్సర్ కణాలకు చేరవేస్తారు. ఇవి కణితి ఎదుగుదలకు కారణమయ్యే నిర్దిష్ట ప్రోటీన్ల ఉత్పత్తిని విజయవంతంగా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా, చికిత్సకు లొంగేలా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు..
రొమ్ము క్యాన్సర్ నమూనాలపై నిర్వహించిన ప్రయోగశాల పరీక్షల్లో ఈ సరికొత్త సాంకేతికత అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ నానో వాహకాలు కణితి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాకే ఔషధాన్ని నియంత్రిత పద్ధతిలో విడుదల చేస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు వేగంగా నశించడమే కాకుండా, కణితి పరిమాణం గణనీయంగా తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఎలుకలపై జరిపిన పరీక్షల్లో.. ఈ ఔషధం కేవలం క్యాన్సర్ కణితులు ఉన్న భాగాల్లోనే కేంద్రీకృతమైంది. శరీరంలోని ఇతర ఆరోగ్యకరమైన అవయవాలపై దీని విష ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
భవిష్యత్ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కీమోథెరపీ వంటి చికిత్సల వల్ల క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని రోగులు తీవ్రమైన జుట్టు రాలడం, నీరసం, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే, పూణే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ ‘ఆప్టామర్-మార్గదర్శక నానోక్యారియర్’ సాంకేతికత భవిష్యత్తులో క్యాన్సర్ కణితులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి, దుష్ప్రభావాలు లేని సురక్షితమైన చికిత్సను అందించడానికి ఎంతగానో దోహదపడుతుందని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సరికొత్త సాంకేతికత ప్రాథమిక ప్రయోగశాల దశల్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. రాబోయే రోజుల్లో మానవులపై జరిపే క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయితే, క్యాన్సర్ వైద్య రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా మారనుంది.

